భార్యా పిల్లలను హింసించి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసి..

భార్యా పిల్లలను హింసించి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసి..
  • మరో మహిళను తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం 
  • 7 నెలల తర్వాత విషయం తెలుసుకున్న భార్యా, పిల్లలు
  • భర్త, అతని ప్రియురాలిని వీధిలోకి ఈడ్చి చితక్కొట్టిన భార్యా, పిల్లలు

పెద్దపల్లి జిల్లా: వ్యసనాలకు బానిసై.. ఏ పనీ చేయకుండా భార్య ఆదాయంపైనే బతకడం ప్రారంభించిన వ్యక్తి.. భార్యా పిల్లలను హింసించి ఇంట్లోంచి తరిమేశాడు. ఏడు నెలలుగా భార్యా పిల్లలు లేకపోవడంతో అడ్డుఅదుపు లేకుండా వ్యసనాలను కొనసాగించడమే కాదు.. మరో మహిళను తీసుకొచ్చి దర్జాగా ఇంట్లోనే కాపురం పెట్టాడు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకు పెళ్లి చేయాల్సిన వ్యక్తి భార్యా పిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించిన విషయం ఏడు నెలల తర్వాత భార్యా పిల్లలకు తెలిసింది. మహిళా సంఘాల నాయకులను వెంటబెట్టుకుని ఇంటికి తిరిగొచ్చి భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా మాటమాట పెరగడంతో భర్తను.. అతని ప్రియురాలిని ఇంట్లోకి వీధిలోకి ఈడ్చుకుని వచ్చి చితక్కొట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. 
               పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాయినీల రాజేషంకు విజయ అనే మహిళతో పాతికేళ్ల క్రితమే పెళ్లయింది. వీరికి పెళ్లీడుకొచ్చిన కూతురు, బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. వ్యసనాలకు  బానిసైన భర్త రాజేశం ..తన భార్య విజయను డబ్బులకోసం వేధింపులకు గురిచేసేవాడు. కాయకష్టం చేసుకుని పిల్లలను చదివించుకుంటున్న విజయ సహించలేక నిలదీస్తే.. నా ఇష్టం.. ఇంట్లో ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లిపోనని తెగేసి చెప్పాడు. సంసారం విషయంలో ఒకసారి గొడవ జరిగితే భర్త తమ్ముడొచ్చి కొట్టడంతో విజయ సహించలేకపోయింది. తన భర్త వచ్చాక మరిది కొట్టిన విషయం చెబితే.. కొడితే కొట్టాడు.. నువ్వు పడి ఉండాలన్నాడు. భర్త వైఖరితో దిగ్భ్రాంతికి గురైన విజయ.. పిల్లల కోసం ఓపికగా సంసారం నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో ఒకరోజు బాగా తాగొచ్చి గొడవ పెట్టుకుని.. కత్తి తీసుకుని చంపేసే ప్రయత్నం చేయడంతో.. తనకు రక్షణ లేదని భావించిన విజయ.. తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాజేషం.. తన వ్యసనాలకు అడ్డులేదని జులాయిగా తిరుగుతూ వచ్చాడు. మహారాష్ట్ర కు చెందిన రజిత అనే మరో వివాహితను తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెట్టాడు. 
ఈవిషయం పసిగట్టిన  బార్య విజయ ఈరోజు కాల్వశ్రీరాంపూర్ కు చేరుకుని.. తన ఇంట్లో ఉన్న భర్తను.. కాపురం చేస్తున్న యువతితో వాగ్వాదానికి దిగింది. భార్యా పిల్లలకు తిండి పెట్టకుండా పంపించి.. మరో మహిళతో కులకడానికి సిగ్గులేదా..? అని నిలదీస్తే..  రాజేషం నా ఇష్టం అంటూ మాట్లాడడంతో మహిళా సంఘాల వారిని సైతం ఆగ్రహానికి గురిచేసింది. దీంతో భార్యా పిల్లలు కలసి రాజేషంను చితకబాది కాల్వశ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తచే వేదింపులకు గురవుతున్న విజయ.. ఆమె పిల్లలకు మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి.